ఇంగ్లీష్‌ రాని అమ్మాయి కలెక్టర్‌ అయ్యింది…

ఇంగ్లీష్‌ రాని అమ్మాయి కలెక్టర్‌ అయ్యింది

సురభీ గౌతమ్‌… ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. మధ్య ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన, కుగ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఇంగ్లీష్‌ మాట్లాడలేక అవమానపడింది. చివరకు అనుకున్నది సాధించింది. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు…

‘ఆరో తరగతి లెక్కల పరీక్షలో వందకు వంద మార్కులు సాధించాను. అప్పుడే క్లాసులో నాకంటూ ఓ గుర్తింపు, ప్రోత్సాహం లభించింది. ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వస్తుందని అప్పుడే నాకు అర్థమయింది” అంటూ తన స్కూలు చదువును గుర్తు చేసుకుంది సురభి. పదో తరగతిలో లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులను సాధించింది. ఈ విజయం ఆమెకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కలను నేరవేర్చుకోవడానికి ఈ విజయాన్ని ఓ మార్గంగా భావించింది.
బాధ్యతగా భావించి
ప్రస్తుతం ఓ మనిషి బతకాలంటే కనీసం వైద్యం, విద్యుత్‌ ఉండాలి. అయితే సురభి పుట్టిన గ్రామంలో ఇలాంటి మౌలిక సదుపాయాలు లేవు. అందుకే ఎప్పటికైనా ఐఏఎస్‌ ఆఫీసరై ఇలాంటి గ్రామాలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇలాంటి ఎన్నో కలలు, ఆశయాలతో ఇంజనీరింగ్‌ చేయడానికి భూపాల్‌ వెళ్ళింది. ”నాకు తెలుసు నాపై ఎంత బాధ్యత ఉందో. నా విజయం వెనుక మా గ్రామంలోని ఎంతో మంది అమ్మాయిల కలలు దాగి ఉన్నాయి. వారి ఆశలను, కలలను తీర్చడం నా బాధ్యత” అంటూ ఆమె తన కాలేజీలో చేరిన మొదటి రోజు గుర్తు చేసుకుంది. ఆ గ్రామం నుండి పై చదువుకు గ్రామం వదిలి బయటకు అడుగుపెట్టిన మొదటి అమ్మాయి సురభి.
వెనక్కు వెళ్ళిపోవాలని
అప్పటి వరకు ఆమె హిందీ మీడియంలో చదువుకుంది. అయితే అక్కడి పిల్లలందరూ ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇది సురభికి పెద్ద ఎదురు దెబ్బగా అనిపించింది. మొదటి రోజు క్లాసు రూములో తనని తాను పరిచయం చేసుకున్న రోజే అవమానానికి గురయ్యింది. అది భరించలేక తన సామాను సర్దుకుని తిరిగి గ్రామానికి వెళ్ళిపోవాలనుకుంది. ఇదే విషయాన్ని తల్లికి చెబితే ”సవాళ్ళు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి” అని సలహా ఇచ్చింది. ”గ్రామంలో నా లాంటి ఆడపిల్లలు ఎందరో నా విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను వెనక్కు వెళ్ళిపోతే మూసి ఉన్న తలుపులు ఇక ఎప్పటికీ తెరుచుకోవు” అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది.
ఏ మూలనో అసంతృప్తి
ఇక తన ప్రయాణాన్ని ఆపదలచుకోలేదు. తన శ్రమను రెట్టింపు చేసింది. ఇంగ్లీష్‌ మాట్లాడడం నేర్చుకుంది. నలుగురిలో తనని తాను ఇంగ్లీష్‌లో పరిచయం చేసుకోవడానికి భయపడిన సురభి తన కాలేజీలోనే కాదు ఆ యూనివర్సిటీ పరిధిలోనే టాపర్‌గా నిలిచింది. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాయాలంటే కనీసం 21 ఏండ్లు ఉండాలి. అయితే ఆమెకు వయసు సరిపోలేదు. దాంతో ఆ సమయాన్ని కూడా ఆమె వృధా చేసుకోకుండా ఇతర పోటీ పరీక్షలు రాసి ఎంపికయింది. కానీ ఇవేవీ ఆమెకు తృప్తి నివ్వలేకపోయాయి. ఏ మూలనో అసంతృప్తి. అసలు లక్ష్యాన్ని తల్లి ఆమెకు గుర్తు చేసింది. దాంతో మళ్ళీ సివిల్‌ సర్వీస్‌పై దృష్టి పెట్టింది.
ఒక్కో నిమిషం
సాధారణంగా సివిల్స్‌కు సిద్ధమయ్యే వారు తమ ధ్యాస మొత్తం వాటిపైనే పెడతారు. కానీ సురభి అలా చేయలేదు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ సాయంత్రం సమయంలో ఒక్కో పేపర్‌కు నాలుగు గంటలు సమయం కేటాయించేది. అయితే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ సమయం సరిపోదు. అందుకే మరింత సమయాన్ని కేటాయించింది. దొరికిన ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంది. కావల్సిన మెటీరియల్‌ సేకరించుకుంది.
అమ్మే స్ఫూర్తిగా
జీవితంలో ఇబ్బంది పెట్టే క్షణాలు ఎన్నో వస్తాయి. వాటిని తట్టుకున్న వాళ్ళే విజయం సాధించగలరు. ”మా అమ్మ 23 ఏండ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. పది నెలల పాపను వదిలిపెట్టి, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పది కిలో మీటర్లు వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చేది. అంత బాధ్యతను మోస్తూ కూడా ఎవ్వరినీ నిందించలేదు. కానీ నాకు అలాంటి బాదరబందీలు లేవు. కాస్త కష్టపడితే అనుకున్నది సాధించగలను. ఇలా అమ్మను చూసి ఎన్నో నేర్చుకున్నాను” అన్నది సురభి.
సేవ చేసినప్పుడే
ఇలా ఎంతో కష్టపడి సివిల్స్‌లో ఆలిండియా 50వ ర్యాంకు సాధించిన ఆమె ”గుజరాత్‌లో నా మొదటి పోస్టింగ్‌. ఇక్కడి వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. సమాజానికి సేవ చేయాల్సిన సివిల్‌ సర్వీస్‌ను ఇక్కడి వాళ్ళు ఓ అధికారంగా భావిస్తున్నారు. కేవలం బాధ్యత తీసుకున్నంత మాత్రాన అధికారి కారు. ప్రజలకు సేవ చేసినప్పుడే ఈ వృత్తికి అసలైన గౌరవం” అంటారామె. ఇలాంటి ఆలోచనలతోనే సురభి తన పనిని ప్రారంభించారు. తన చేతలతో అతి తక్కువ కాలంలోనే ప్రజల గౌరవాన్ని పొందారు.
ఎన్నో సవాళ్ళు
సురభి ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదర ప్రాంతంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ”ఇప్పటి వరకు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఎన్నో ఒత్తిళ్ళను, సవాళ్ళను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటివి ఎన్ని ఎదురైనా ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడంపైనే దృష్టి పెడుతున్నాను” అంటారామె.
ఈ విధంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సురభి ఎన్నో అడ్డంకులను బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగారు. ఒక స్ఫూర్తి దాయకమైన ఆఫీసర్‌గా గుర్తింపు పొందారు. ఎంతో మంది విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు

About The Author