కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి సుహాసిని…

 

కూకట్‌పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి సుహాసిని జోరు పెంచారు. స్థానిక నాయకుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మెుదలెట్టారు. తన రాజకీయ అభ్యర్థిత్వంపై శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిని ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.కూకట్ పల్లి నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్న ఆమె ప్రజలకు సేవ చేసేందుకు ఇది ఒక వరంలా భావిస్తానన్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించిన ఆమె తరువాత తన రాజకీయ చతురతకు పదును పెట్టారు.ముందుగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ఫోన్లు చేశారు. పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని సహకరించాలని కోరారు. టీడీపీ సీనియర్‌ నేతలు పెద్దిరెడ్డి, మందాడికి ఫోన్ చేశారు. ఇరు నేతల మద్దతును ఆమె కోరారు. దీంతో వారు సుహాసిని గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు.మరోవైపు హరికృష్ణ నివాసంలో సుహాసినిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు కలిశారు. టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సుహాసిని గెలిచేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ లో స్థాపించారని ఇక్కడే సుహాసిని పోటీ చెయ్యడం సంతోషకరమన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన ఆయన ఆత్మ తెలంగాణలోనే ఉంటుందన్నారు. నష్టమని తెలిసినా తెలంగాణ రాష్ట్రం విషయంలో టీడీపీ ముందుకెళ్లిందని తెలిపారు. త్వరలో టీడీపీకి పునర్వైభవాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 12మంది అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.

About The Author